డీజిల్ దొంగల ఆటకట్టు
డీజిల్ చోరీ కోసం ఓ అంతర్రాష్ట్ర ఘరానా ముఠా బరి తెగించింది. ఐవోసీఎల్, బీపీసీఎల్ ప్రధాన పైప్లైన్కే కన్నం వేసి అపహరణకు పాల్పడింది. వీరి ఆయిల్ చోరీ గుట్టును రాచకొండ పోలీసులు చేధించారు. నిందితులను అరెస్ట్ చేశారు.
డీజిల్ చోరీ కోసం ఓ అంతర్రాష్ట్ర ఘరానా ముఠా బరి తెగించింది. ఐవోసీఎల్, బీపీసీఎల్ ప్రధాన పైప్లైన్కే కన్నం వేసి అపహరణకు పాల్పడింది. వీరి ఆయిల్ చోరీ గుట్టును రాచకొండ పోలీసులు చేధించారు. నిందితులను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్ నుంచి చర్లపల్లి ఐవోసీఎల్, బీపీసీఎల్ ఆయిల్ సంస్థల నిల్వ కేంద్రాలకు డీజిల్ సరఫరా కోసం 17 కిలో మీటర్ల ప్రధాన పైప్లైన్ ఉంది. మహారాష్ట్ర థానే జిల్లాకు చెందిన ఎలక్ట్రీషియన్ హఫీజ్ అజీజ్ చౌదరి, ముంబయికి చెందిన జియావుల్ చాంద్షేక్ అలియాస్ చెడ్డీ బెంగాలి, సర్జూ, సురేశ్కుమార్ ప్రజాప్రతి, మహబూబ్నగర్కు చెందిన బిన్ని శ్రీనివాసులు నేతృత్వంలోని ముఠా ఈ పైప్లైన్పై కన్నేసింది. వీరంతా కలిసి కీసరలో మహేందర్గౌడ్ను కలిసి ప్రధాన పైప్లైన్ పక్కనే ఉన్నఅతని స్థలాన్ని లీజుకు తీసుకున్నారు.
ఆయిల్ లైన్ పక్కన లీజుకు తీసుకున్న స్థలంలో షెడ్ నిర్మించి, రహస్య సొరంగం తవ్వారు ముఠా సభ్యులు. 10 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో సొరంగం నిర్మించారు. పైప్లైన్కు క్లాంప్లను బిగించి, రెండు అంగుళాల రంధ్రం చేశారు. నెల రోజుల్లో బీపీసీఎల్ సంస్థకు చెందిన 84,365 కి లీటర్లు, ఐవోసీఎల్ సంస్థకు చెందిన 46,236 లీటర్ల డీజిల్ను చోరీ చేశారు. వరంగల్, బాచుపల్లి, బూర్గుల, కోయల్కొండ, మహారాష్ట్రలోని ధర్మాబాద్లకు డీజిల్ తరలించి తక్కువ ధరకు విక్రయించారు.
ఘట్కేసర్ నుంచి తమ సంస్థల బంకులలోకి సరఫరా అవుతున్న డీజిల్ తూకాల్లో తేడాలు రావడాన్ని ఐవోసీఎల్, బీపీసీఎల్ సంస్థల ప్రతినిధులు గత డిసెంబరు 3న గుర్తించారు. రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ బృందం షెడ్డుపై దాడి చేసి అజీజ్చౌదరి, శ్రీనివాసులు, అబ్దుల్ అబ్రార్, జయకృష్ణ, సర్జూను పట్టుకుంది. డీజిల్ చోరీ చేసి సంపాదించిన రూ.90 లక్షల నాలుగు వేల నగదు, డీజిల్ ట్యాంకర్, స్కార్పియో, హోండా యాక్టివా వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయిల్ చోరీ కోసం తవ్విన సొరంగం చూసి పోలీసులు షాక్ తిన్నారు. ప్రధాన ఆయిల్ పైప్లైన్ వేడెక్కినా, చిన్నపాటి మెరుపులు చోటు చేసుకున్నా భారీ విస్ఫోటం సంభవించే ప్రమాదం ఉండేది.