ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మాజీ ప్రధాని దేవెగౌడ ఫోన్ చేశారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి రావాలని పిలిచారు. అయితే దీనిక చంద్రబాబు స్పందిస్తూ సమయం చూసుకొని అన్ని వివరాలూ వెల్లడిస్తానని చంద్రబాబు ఆయనతో చెప్పినట్టు సమాచారం. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరుపై పలువురు జాతీయ నేతలు ఆరా తీస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకి ఇతర రాష్ట్రాల నేతలు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొంటున్నారు. ఆంధ్రాలో ఎన్నికలు జరిగిన తీరు, ఈవిఎంల మొరాయింపు. పోలింగ్ రోజుల జరిగిన గొడవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక నుంచి మాజీ ప్రధాని దేవెగౌడ, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో పాటు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ఫోన్లో సంభాషించారు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇన్ని అరాచకాలను చూడలేదన్నారు చంద్రబాబు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ అరోరాను కలిసిన బాబు ఏపీలో పోలింగ్ జరిగిన తీరుపై ఫిర్యాదు చేశారు. ఏపీలో అడ్మినిస్ట్రేషన్ను నిర్వీర్యం చేయాలని చూశారని, దాడులతో రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చాలనుకున్నారని మండిపడ్డారు. ఈవీఎంలపై ప్రతి ఒక్కరికి అనుమానాలు ఉన్నాయన్న చంద్రబాబు ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని నిప్పులు చెరిగారు. ఈవీఎంలు పనిచేయకపోతే వైసీపీ ఎందుకు మాట్లాడలేదని చంద్రబాబు ప్రశ్నించారు.