అవినీతి రహిత పాలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. అడ్మినిష్ట్రేషన్ విధానాన్ని సరికొత్తగా రూపొందిస్తున్నారు. సమర్థవంతమైన అధికారులతో పరిపాలన సాగించేందుకు సంస్కరణలు చేపడుతున్నారు. సివిల్ సర్వెంట్స్ తరహాలోనే రాష్ట అధికారులను తయారు చేసి, వారికి పనులు అప్పగించేందుకు కొత్త చట్టాలకు రూపాకల్పన చేస్తున్నారు. ఇందులో భాగంగా రెవెన్యూశాఖను రద్దు చేస్తారని సమాచారం.
టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పటైన తర్వాత సీఎం కేసీఆర్ పరిపాలన విధానంలో నూతన సంస్కరణలు తీసుకురానున్నారు. అధికారులు ప్రజలకు చేరువలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సమర్థవంతమైన ప్రభుత్వోద్యోగులతో పాలనను పరుగులు పెట్టించేందుకు చట్టాలను రూపొందించనున్నారు.
సివిల్ సర్వీస్ తరహాలోనే తెలంగాణ అడ్మినిష్ట్రేటివ్ సర్వీసును ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ సారధ్యంలో సీనియర్ అధికారుల నాయకత్వంలో పటిష్టమైన అధికార వ్యవస్థ ఉండబోతోంది. ప్రస్తుతం జిల్లా స్థాయిలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఆయా పేర్లను తొలగించి కలెక్టర్ నాయకత్వంలో అదనపు కలెక్టర్తో పాటు, అదనపు జిల్లా పరిపాలన అధికారులుగా పిలిచే ముఖ్య అధికారుల బృందంతో జిల్లా స్థాయిలో పటిష్టమైన అధికారిక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు సీఎం కేసీఆర్.
ఇప్పటికే పరిపాలన సంస్కరణలో భాగంగా రెవెన్యూశాఖను రద్దు చేసే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ శాఖకు చెందిన ఉద్యోగులను ఇతర శాఖల్లో విలీనం చేసేందుకు పనులు మొదలైనట్టు సమాచారం. అయితే రెవెన్యూశాఖ రద్దుపై సదరు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పారదర్శకమైన పాలన అందించేందుకు అవసరమైన చట్టాన్ని రూపొందించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు సీఎం కేసీఆర్.