పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిన్న బాపట్ల నేతలతో రివ్యూ నిర్వహించారు. బాపట్ల ఎంపీ అభ్యర్ధిగా మరోసారి మాల్యాద్రిని ఖరారు చేసిన చంద్రబాబు ఈ పార్లమెంట్ స్థానం పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులను కూడా దాదాపు ఫైనల్ చేశారు. అద్దంకి అభ్యర్ధిగా గొట్టిపాటి రవికుమార్ పర్చూరు నుంచి ఏలూరు సాంబశివరావు రేపల్లె నుంచి అనగాలి సత్యప్రసాద్ వేమూరు అభ్యర్ధిగా నక్కా ఆనందబాబును ఖరారు చేశారు. ఇక బాపట్ల, సంతనూతలపాడు, చీరాల అసెంబ్లీ అభ్యర్ధులను రెండ్రోజుల్లో ప్రకటించనున్నారు. అయితే బాపట్ల టికెట్ రేసులో అన్నం సతీష్, వేగేశ్న నరేంద్రవర్మ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే సంతనూతలపాడుకి విజయ్ కుమార్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక చీరాల అభ్యర్ధిగా కరణం బలరాం పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.