ఐఏఎస్ అధికారి చంద్రకళ ఇంటిపై సీబీఐ దాడులు
యూపీ ఐఏఎస్ అధికారి చంద్రకళ ఇంటిపై సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడినట్టు ఆమెపై ఆరోపణలున్నాయి.
యూపీ ఐఏఎస్ అధికారి చంద్రకళ ఇంటిపై సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడినట్టు ఆమెపై ఆరోపణలున్నాయి. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన సీబీఐ యూపీతోపాటు ఆమె స్వస్థలం తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఏకకాలంలో 12చోట్ల సోదాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గర్జనపల్లి చంద్రకళ స్వగ్రామం. 2008లో సివిల్స్ సాధించిన చంద్రకళ అలహాబాద్ లో ట్రైనీ ఆర్డీఓగా చేరారు. బులంద్ షహర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో రహదారి పనుల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్లకు చంద్రకళ క్లాస్ పీకిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా నాణ్యత లేకుండా పనులు చేసినందుకు 12 కాంట్రాక్టులను సైతం ఆమె రద్దు చేశారు. అత్యంత నిక్కచ్చిగా ఉండే అధికారిణిగా పేరుతెచ్చుకున్న చంద్రకళను ప్రధాని మోదీ స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర్గా, కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శిగా నియమించారు. తాజాగా అలాంటి అధికారిణిపై సీబీఐ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం.