తెలుగు రాష్ట్రాల సీఎంలపై బీజేపీ నేత బండారు దత్తాత్రేయ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ గోడ మీద పిల్లి లాంటోడు, చంద్రబాబు అవకాశవాదని ధ్వజమెత్తారు. గురువారం ఢిల్లీలో దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తాగునీటి ప్రాజెక్టుల విషయంలో వాగ్దానాలకే పరిమితం అయిందని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ సర్కార్, సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని దుయ్యబట్టారు. కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.52 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. 80 వేల కోట్లకు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని పెంచి ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. ఇంటర్ బోర్డు అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కమిటీ రిపోర్ట్ ఇచ్చినా గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోలేదని దత్తాత్రేయ నిప్పులు చెరిగారు. మోదీ సర్కార్ తిరిగి అధికారం చేజిక్కించుకోవడం ఖాయమన్నారు. ఫెడరల్, మహా కూటములు మా దరిదాపుల్లో కూడా లేవు.. లోక్సభ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో బీజేపీ, టీఆర్ఎస్కు గట్టిపోటీనిచ్చిందని వెల్లడించారు.