దేశ ప్రజలు అవినీతి రహిత, సమర్ధవంతమైన పాలనకు పట్టం కట్టారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మహాకూటమి పేరుతో జట్టుకట్టిన అవినీతి పార్టీలకు ప్రజలు తగిన బుద్దిచెప్పారని ఆయన అన్నారు. ఫెడరల్ ఫ్రంట్, బీజేపీయేతర కూటమి అంటూ తిరుగుతున్న ఇద్దరు చంద్రులకు ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారన్నారు. తెలుగు రాష్ట్రాలకు పట్టిన చంద్ర గ్రహణం ఈ నెల 23తో వీడుతుందని ఆయన అన్నారు. త్వరలోనే గాంధీ భవన్ టు లెట్ బోర్డ్ తప్పదన్నారు. ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలపై సోమవారం లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇద్దరు చంద్రులు ఫెడరల్ ఫ్రంట్, ఫ్యామిలీ ఫ్రంట్కు టెంటు లేదని తేల్చిచెప్పేశారు. ఒకాయన అడవి బాట పడితే.. ఇంకోకాయన ఢిల్లీ, కోల్కత్తా ఇలా భేటీలకు వెళ్తున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తెలంగాణలో బీజేపీకి మంచి ఫలితాలు రాబోతున్నాయి. తెలంగాణలో ఎగ్జిట్ పోల్ను మించి మాకు సీట్లు వస్తాయి అని లక్ష్మణ్ జోస్యం చెప్పారు.