ఆర్టీసీ బస్లో కాల్పులు జరిపిందెవరో పోలీసులు కనిపెట్టారు. ఏపీ సెక్యూరిటీ వింగ్స్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ గా గుర్తించారు. విధులు ముగించుకుని వెళ్తున్న క్రమంలో బస్ ఎక్కిన శ్రీనివాస్ కాల్పులు జరిపినట్లు గుర్తించారు. శ్రీనివాస్ ఓ ప్రముఖుడి దగ్గర సెక్యూరిటీ విదులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు నిందితుడు శ్రీనివాస్ను టాస్క్ఫోర్స్ పోలీసులు కూకట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఈ ఘటనపై ఏపీ డీజీపీ ఠాకూర్ స్పందించారు. హైదరాబాద్ పోలీసులు తమకు సమాచారం అందించారని శ్రీనివాస్ వ్యవహారంపై దృష్టి సారించినట్లు వివరంచారు. శ్రీనివాస్కు డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. ఏదేమైనా జనం మధ్య ఫైర్ ఓపెన్ చేయడం తీవ్రమైన నేరం అని ఘటన వెనుక కారణాలు తెలుసుకుంటామని ఠాకూర్ వివరించారు.
ఈ ఉదయం సికింద్రాబాద్ నుంచి మణికొండకు వెళ్తున్న ఆర్టీసీ సిటీ బస్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 10 గంటలా 45 నిమిషాల నుంచి 11 గంటల మధ్య కాల్పులు జరిగాయి. బుల్లెట్ బస్ టాప్ నుంచి దూసుకుపోయింది. ఒక్కసారిగా సంచలనం సృష్టించిన ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ కండక్టర్, డ్రైవర్ బస్ను డైరెక్ట్గా డిపోకు తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన పంజాగుట్ట పోలీసులు డ్రైవర్ యాకూబ్, కండక్టర్ భూపతి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.