ఆంధ్రప్రదేశ్లో మరోసారి ప్రత్యేక హోదా సెగలు ఎగసిపడుతున్నాయి. ఎన్నికల ముందు హోదా పోరు మళ్ళీ ప్రారంభమైంది. ప్రత్యేక హోదా డిమాండ్తో ఇవాళ ఏపీ బంద్ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న బంద్ తెల్లవారుజాము నుంచే ప్రారంభమైంది. వామపక్ష శ్రేణులు, ప్రజా సంఘాలు తెల్లవారకుండానే బస్ డిపోల దగ్గర ఆందోళనకు దిగాయి. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నాయి. దీంతో ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
ప్రత్యేక హోదా సాధనా సమితి నేతృత్వంలో జరుగుతున్న బంద్కు కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో పాటు, పలు ప్రజా, ఉద్యోగ, రవాణాసంఘాలు మద్దతు తెలిపాయి. ఈ బంద్కు మద్దతు ఇవ్వడం లేదని ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, జనసేన, వైసీపీ , బీజేపీ ప్రకటించాయి. బంద్లకు టీడీపీ వ్యతిరేకం కాబట్టి నిరసన ర్యాలీలు జరుపుతామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. కేంద్రం చేసిన మోసంపై బంద్ రోజు అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరిగేలా ఆయన కార్యాచరణ రూపొందించారు.
ఏపీకి ద్రోహం చేసిన టీడీపీ బంద్కు మద్దతిచ్చిన కారణంగా వైసీపీ బంద్కు దూరంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఇక అత్యవసరమైతే తప్ప బంద్కు వెళ్లకూడదనేది జనసేన విధానమని, అందుకు అనుగుణంగానే బంద్లో పాల్గొనడం లేదని జనసేన నేతలు చెప్పారు. ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా ప్రధాని మోడీ చేపడుతున్న విధానాలను నిరసిస్తూ జరుగుతున్న బంద్ కు అందరూ కలిసి రావాలని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కోరారు. ఏపీ ప్రయోజనాల కోసం చేస్తున్న బంద్కు సహకరించాలని వామపక్ష నేతలు కోరారు. మరోవైపు ఏపీ బంద్ నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వాయిదా పడిన ఇవాల్టి పరీక్ష నిర్వహణ తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.