పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో సికింద్రాబాద్ సీటుపై ప్రధాన పార్టీలు కన్నేశాయి. సిట్టింగ్ సీటును నిలుపుకునేందుకు బీజేపీ వ్యూహ రచన చేస్తుండగా, లష్కర్ పై గులాబీ జెండా ఎగురవేసేందుకు టీఆర్ ఎస్ తహతహలాడుతోంది. ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలలో కాంగ్రెస్ ఉంది. లష్కర్ టికెట్ కోసం బీజేపీ, టీఆర్ఎస్ ల్లో పోటీ నెలకొంది.
త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం గెలుచుకునేందుకు వ్యూహం రుపొందిస్తున్నాయి. ప్రస్తుతం లష్కర్ ఎంపీగా బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఉన్నారు. మళ్లీ ఈ సీటును దక్కించుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఇంతవరకు లష్కర్ ఎంపీ సీటు ఖాతా తెరవని అధికార టీఆర్ఎస్ ఈ సారి జెండా పాతాలని డిసైడ్ కాగా, పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పాకులాడుతోంది.
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని చెప్పే సీటు సికింద్రాబాద్ ఒకటే. తమ ఖాతాలోనున్న సీటును కాపాడుకునేందుకు కమలనాథులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వయోభారం దృష్ట్యా దత్తాత్రేయ తిరిరగి పోటీ చేయరు అనే ప్రచారం జరుగుతుండడంతో పార్టీ సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు టికెట్ కోసం పోటీ పడుతున్నారు.
టీఆర్ఎస్ ఆవిర్బావం నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం గెలుపొందలేదు. రెండో సారి అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ ఈసారి ఎలాగైనా లష్కర్ లో గులాబీ జెండా ఎగురవేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో లోక్ సభ ఎన్నికల్లో కారు గెలుపు ఈజీ అనే అంచనాలో కేసీఆర్ ఉన్నారు.
సికింద్రాబాద్ సీటు కోసం టీఆర్ఎస్ లో అధిక పోటీ ఉంది. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ పార్లమెంటరీ ఇన్ చార్జ్ బండి రమేష్ , పార్టీ జనరల్ సెక్రటరీ, కేసీఆర్ నమ్మిన బంటు దండే విఠల్ కూడా ఆశలు పెట్టుకున్నారు. మేయర్ బొంతు రామ్మెహన్ భార్య శ్రీదేవి పేరు కూడా వినిపిస్తోంది.
లష్కర్ సీటుపై కాంగ్రెస్ నజర్ పెట్టింది. గతంలో రెండుసార్లు గెలిచి, గత ఎన్నికల్లో ఎన్నికల్లో ఓడిపోయిన అంజన్ కుమార్ కే మళ్లీ సీటు కేటాయించే అవకాశం ఉంది. సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా అంజన్ ఉండటంతో ఆయనక కలిసివస్తుందనే నమ్మకంతో ఆయన అనుచరులున్నారు. ఈ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు గణనీయంగా ఉండటంతో అజారుద్దీన్ పేరును కూడా హై కమాండ్ పరిశీలిస్తుంది.
లష్కర్ సీటు తమదంటే తమదేనన్న ధీమాలో ఉన్న పార్టీలు.. అధిక సంఖ్యలోనున్న ఆశావాహులతో పరేషన్ అవుతున్నాయి.