తెలంగాణ ఇంటర్ రీ వెరిఫికేషన్, రీ వాల్యుయేషన్ ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. 11 వందల 37 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించింది. అయితే ఈ ఫలితాలను వెబ్సైట్లో కనిపించకపోవడంతో మరోసారి ఆందోళన వ్యక్తమైంది. ఆన్సర్ షీట్స్ స్కానింగ్ ప్రక్రియ జరుగుతుందని త్వరలోనే పూర్తి వివరాలతో వెబ్సైట్లో పొందుపరుస్తామని స్పష్టం చేసింది.
తీవ్ర వివాదానికి కారణమైన తెలంగాణ ఇంటర్ రీ వెరిఫికేషన్, రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల తర్వాత ఫెయిల్ అయిన విద్యార్థుల్లో 11 వందల 37 మంది విద్యార్థులు పాసైనట్టు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఇందులో ఫస్టియర్లో 585 మంది, సెకండియర్లో 552 మంది విద్యార్తులు ఉత్తీర్ణత సాధించారు. గత ఎప్రిల్ 18 న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 3 లక్షల 82 వేల 116 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. దీంతో పేపర్ వాల్యుయేషన్ సరిగ్గా జరగలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇటు విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకోవడంతో వివాదం తీవ్రరూపం దాల్చింది. దీంతో ప్రభుత్వం కమిటీ వేసి నివేదికను తెప్పించుకుంది. పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియను నిర్వహించిన గ్లోబరీనా సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
అయితే హైకోర్టు ఆదేశాలతో ఇంటర్ బోర్డు ఉచితంగా రీవెరిఫికేషన్ నిర్వహించింది. ఫెయిల్ అయిన విద్యార్థుల్లో 92,429 మంది విద్యార్థుల ఆన్సర్ షీట్లను రీవెరిఫికేషన్ చేసి ఫలితాలను ప్రకటించారు. అయితే ఆన్సర్ షీట్స్ స్కానింగ్ ప్రక్రియ కొనసాగుతుందని అందుకే ఫలితాలను కాస్త ఆలస్యంగా విడుదల చేసినట్లు బోర్డు ప్రకటించింది. ఇటు తాజాగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సంబంధించిన రీవెరిఫికేషన్, రీకౌంటింగ్లో వచ్చిన మార్కులను వచ్చే రెండు రోజుల్లో వెల్లడిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అలాగే రీవెరిఫికేషన్కు ఫీజు చెల్లించిన విద్యార్థులకు జూన్ 12 తరువాత తిరిగి చెల్లిస్తామని తెలిపారు.