పంజాబ్లోని సంగ్రూర్ గ్రామం ఊపిరి పీల్చుకుంది. 109 గంటల పాటు కొనసాగిన ఉత్కంఠ వీడింది. ఆయుష్షు ఇంకా ఉందో లేక నూకలింకా మిగిలి ఉన్నాయో తెలీదు కానీ ఆ బాలుడు మాత్రం నిజంగా మృత్యుంజయుడే. 5 రోజుల క్రితం 150 అడుగుల లోతైన బావిలో పడ్డ ఫతేవీర్ సింగ్ ప్రాణాలతో బయటపడ్డాడు. గత గురువారం రోజు సంగ్రూర్ గ్రామంలో రెండేళ్ల బాలుడు ఫతేవీర్ సింగ్ ఆడుకుంటూ ప్రవాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ టీం రంగంలోకి దిగింది. బోరుబావికి సమాంతరంగా మరో బావిని తవ్వి సహాయక చర్యలు చేపట్టారు. ఓ వైపు పైప్లతో ఆక్సిజన్ అందిస్తూనే సహాయక చర్యలు చేపట్టింది. బోరుబావిలోకి కెమెరాలు పంపించి బాలుడి పరిస్థితిని తెలుసుకున్నారు. 150 అడుగుల లోతులో బాలుడు చిక్కుకున్నట్లు గుర్తించారు.
గంటలు గడుస్తూనే ఉన్నాయి. అయినా చిన్నారి పరిస్థితేంటో తెలియడం లేదు. ఓ వైపు సహాయక చర్యలు కొనసాగుతున్నా బాలుడి ప్రాణాలపై అందరికీ సందేహాలు మొదలయ్యాయి. అంతలోతులో ఉన్న చిన్నారి బతుకుతాడా..? ప్రాణాలతో బయటపడతాడా..? అన్న ఆందోళనతో.. ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలంటూ.. కుటుంబ సభ్యులు పూజలు చేయగా గ్రామస్తులు హోమాలు కూడా చేశారు. చివరికి వారి పూజలు ఫలించాయి. నాలుగు రోజులకు పైగా బోరుబావిలో ఉన్న ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటలా 10 నిమిషాల సమయంలో బోరుబావిలో చిక్కుకున్న బాలుడిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. వెంటనే చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారి క్షేమంగా బయటపడటంతో తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.