టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మల రెండో రిసెప్షన్ వేడుక ముంబైలో అట్టహాసంగా జరిగింది. లోయర్ పారెల్లోని సెయింట్ రెజిస్ లగ్జరీ హోటల్లో ఘనంగా జరిగిన ఈ వివాహ విందుకు అతిరథ మహారథులు తరలివచ్చారు.
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మలు బాలీవుడ్, క్రికెట్ ప్రముఖులకు అదిరిపోయే వివాహ విందు ఏర్పాటు చేశారు ముంబైలో జరిగిన రెండో రిసెప్షన్ వేడుకలు అట్టహాసంగా జరిగింది.. రిసెప్షన్కి పలువురు బాలీవుడ్ తారలు, క్రికెట్ స్టార్లు హాజరయ్యారు. సినీ, వ్యాపార, క్రీడారంగాల ప్రముఖులు కొత్త జంటను ఆభినందించారు. శ్రీలంకతో సిరీస్ ముగియడంతో టీమిండియా ఆటగాళ్లంతా ఈ వేడుకకు విచ్చేశారు. పాత విభేదాలను పక్కనబెడుతూ భారత మాజీ కోచ్ అనిల్ కుంబ్లే సతీసమేతంగా ఈ ఫంక్షన్కు వచ్చారు.
మాజీ కెప్టెన్ ధోని భార్యాబిడ్డలతో వచ్చాడు. టీమిండియా ప్లేయర్స్ రోహిత్ శర్మ తన భార్య రితికాతో కలిసి వచ్చాడు. మనీశ్ పాండే, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, బుమ్రా, ఉమేశ్ యాదవ్, అశ్విన్, పుజారా, ఉనాద్కట్, చహల్, అక్షర్ పటేల్, మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్, బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గావస్కర్ తదితరులు విరుష్క జోడీకి శుభాకాంక్షలు తెలిపారు.
బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, రణ్బీర్ కపూర్, మాధురీ దీక్షిత్, శ్రీదేవి, బోనీ కపూర్, కత్రినా కైఫ్, దర్శకుడు కరణ్ జోహర్ హాజరయ్యారు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రత్యేక గౌన్లో తళుక్కున మెరిసింది. మహేశ్ భూపతి, లారాదత్తాల రాకతో ఈ వేడుక అదిరిపోయింది. నీతా అంబానీ, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా రిసెప్షన్కు హాజరయ్యారు.