అతిలోక సుందరి శ్రీదేవి దివంగతులయ్యారు. భర్త, చిన్న కుమార్తెతో కలిసి ఓ వివాహ నిమిత్తం దుబాయి వెళ్లిన శ్రీదేవి.. అక్కడే గుండెపోటుతో మృత్యు ఒడికి చేరిపోయారు. ఆమె మృతితో ఇండియన్ సినిమా శోకసంద్రంలో మునిగిపోయింది. బోనీ కపూర్తో వివాహమయ్యాక ఆమె సినిమాలకు దూరమవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఆ తరువాత 2012లో వచ్చిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. 2017లో వచ్చిన ‘మామ్’ చిత్రం ఆమె నటించిన అద్భుత చిత్రాల్లో ఒకటి అని చెప్పాలి. ఈ సినిమాలో అమ్మ అంటే శ్రీదేవిలా ఉండాలి అన్నంతగా ఆ పాత్రలో లీనమై నటించారు. ఆ తరువాత మంచి కథలు వస్తే తప్పకుండా నటిస్తానని శ్రీదేవి చాలా సందర్భాల్లో చెప్పారు.
ఆఖరి ట్వీట్ ఇదే..:
తోటి నటీనటులను, ఇతర సినిమాలను ప్రోత్సహించడంలో శ్రీదేవి ఎప్పుడూ ముందుంటారు. తమిళంలో నటి ధన్సిక ప్రధాన పాత్రలో ‘కాతడి’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందంటూ శ్రీదేవి ట్వీట్ చేశారు. చిత్ర బృందానికి విషెస్ తెలిపారు. ఈ ట్వీట్ పెడుతున్నప్పుడు శ్రీదేవి దుబాయ్లో ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇలాంటి ఓ మంచి సినిమాను అభినందించాలి అన్న ఆలోచనను బట్టే అర్థమవుతోంది శ్రీదేవిది ఎంత గొప్ప మనసో. దురదృష్టవశాత్తు అతిలోక సుందరి చేసిన ఆఖరి ట్వీట్ కూడా ఇదే.