మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్రెడ్డి కుమారుడు రాంకుమార్రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సమక్షంలో రాంకుమార్రెడ్డి వైసీపీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం విశాఖ జిల్లా పెందూర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కండువా కప్పి రామ్కుమార్ను, ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి 1990, డిసెంబర్ 17 నుంచి 1992, అక్టోబర్ 9 వరకు ఏపీ సీఎంగా సేవలందించారు. ప్రజలకు రాజకీయ నాయకులపై ఉండాల్సింది అభిమానం, నమ్మకమని ఇవి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి నెలకొల్పారని నేదురుమల్లి రామ్కుమార్ అన్నారు. మళ్లీ ప్రజలకు రాజకీయ నాయకులపై నమ్మకం రావాలంటే అది జననేత వైఎస్ జగన్తోనే సాధ్యమన్నారు.