పవన్ వ్యాఖ్యలపై కిడారి భార్య మౌనదీక్ష

Update: 2018-10-17 04:04 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కిడారి సర్వేశ్వరరావు భార్య పరమేశ్వరి ఆందోళన చేపట్టారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే మావోయిస్టులకు మద్దతు ఇచ్చినట్టు కనిపిస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసలు జనసేన కవాతు సందర్భంగా కిడారి సర్వేశ్వరరావును ఉద్దేశించి పవన్ ఏమన్నారు..? పరమేశ్వరి ఏమంటున్నారు..? 

జనసేన కవాతులో పవన్ చేసిన కామెంట్స్‌ దురమారం రేపుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును చంపింది గోదావరి జిల్లా నుంచి నక్సలిజంలోకి వెళ్లిన ఆడపడుచని నక్సలిజం వైపు ఆమె ఎందుకు వెళ్లిందో ఆలోచించుకోవాలని పవన్‌ చెప్పడం వివాదాస్పదమైంది.

పవన్‌ వ్యాఖ్యలపై కిడారి సర్వేశ్వరరావు సతీమణి పరమేశ్వరి నిరసన వ్యక్తంచేశారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద ఆమె ఆందోళన చేపట్టారు. తన భర్త హత్యకు గురై నెల కూడా కాకముందే ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలుచేయడం తమనెంతగానో బాధించిందని .. కిడారి గురించి ప్రజలందరికీ తెలుసని ఆమె తెలిపారు. తమకు ధైర్యం ఇవ్వాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలతో బాధపెట్టొద్దని ఆమె కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఈపీడీసీఎల్ డైరెక్టర్ శోభా హైమావతి, తెలుగు మహిళా సంఘం నేతలు పాల్గొని పరమేశ్వరికి సంఘీభావం ప్రకటించారు.  

Similar News