ప్రముఖ సోషల్ మీడియా నెట్ వర్క్ వాట్సాప్ మొరాయించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు అసహనానికి లోనయ్యారు. 2018కి స్వాగతం చెప్పేందుకు ఆదివారం సాయంత్రం నుంచి వాట్సాప్ వినియోగదారులు సిద్దమయ్యారు. తమ స్నేహితులకు విషస్ చెప్పేందుకు మిలియన్ల కొద్ది మెసేజ్ లను షేర్ చేశారు. దీంతో వాట్సాప్ క్రాష్ డౌన్ అయ్యింది. అయితే వాట్సాప్ మొరాయించడంతో యూకే, భారత్ , యూరప్, బ్రెజిల్ దేశాల్లో 54 శాతం మందికి కనెక్టింగ్, 27 శాతం మందికి మెసేజ్ సెండింగ్, 17 శాతం మందికి లాగిన్ సమస్యలు తలెత్తాయి. దీంతో వినియోగదారులు వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో ట్విట్టర్ ను ఆశ్రయించారు. #WhatsAppDown అనే హ్యాష్ ట్యాగ్ ను షేర్ చేస్తూ సదరు సంస్థకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ సమస్యపై అందిన ఫిర్యాదులతో స్పందించిన వాట్సాప్ ప్రతినిధులు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. ఒకేసారి వేలాదిగా న్యూఇయర్ మెసేజ్లు వెల్లువెత్తడంతో సాంకేతిక సమస్య తలెత్తినట్టు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. రెండు గంటల తరువాత మళ్లీ వాట్సాప్ యధావిధిగా పనిచేస్తోందని, ఎలాంటి సమస్యలు లేవని ప్రకటించారు.