బాలీవుడ్ లో సెగలు పుట్టిస్తున్న మీ టూ ఉద్యమం మీడియాలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా బాలీవుడ్ లో అత్యంత సంస్కారవంతుడుగా పేరొందిన నటుడు అలోక్నాథ్ తనపై అత్యాచారం చేశారని ప్రొడ్యూసర్ వింటా నందా ఆరోపించారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, మాజీ ఎడిటర్ ఎంజే అక్బర్ తమతో అసభ్యకరంగా వ్యహరించినట్టు మహిళా జర్నలిస్ట్లు గుట్టు విప్పుతున్నారు. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన అలోక్ నాథ్ ప్రస్తుత రోజుల్లో ప్రపంచం ఎలా తయారైందంటే ఆడవారేది చెబితే అదే నమ్ముతున్నారు అని వాపోయారు.
ఇప్పుడు భారత్లో బాలీవుడ్ నుంచి మీడియాకు ‘మీ టూ’ ఉద్యమం విస్తరిస్తోంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ దగ్గరి నుంచి మాజీ ఎడిటర్, బీజేపీ ఎంపీ ఎంజే అక్బర్ వరకు అందరిపైన లైంగిక వేధింపుల ఆరోపణల పరంపర కొనసాగుతోంది. కొందరు స్పందించేందుకు తిరస్కరిస్తున్నారు. ఇంకొందరు ఖండిస్తున్నారు.
బాలీవుడ్ లో అత్యంత సంస్కారవంతుడుగా పేరొందిన నటుడు అలోక్నాథ్ తనపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడని రచయిత, ప్రొడ్యూసర్ వింటా నందా ఆరోపించారు. తనతో బలవంతంగా మద్యం తాగించి మరీ అలోక్నాథ్ రేప్ చేశాడని 20 ఏళ్ల సంఘటనను గుర్తు చేసుకున్నారు. 90వ దశకంలో టీవీ షో ప్రధాన నటిని కూడా లైంగికంగా వేధించాడనీ, అలోక్నాథ్ తాగుబోతు, దుర్మార్గుడని విటా నందా సుదీర్ఘమైన తన ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు.
వింటా నందా ఆరోపణలను అలోక్నాథ్ ఖండించారు. ఆమెను వేరేవాళ్లేవరో రేప్ చేసి ఉండొచ్చున్నారు. ఒకానొక సమయంలో ఆమె నాకు మంచి స్నేహితురాలు. కానీ ఇప్పుడు పెద్ద సమస్యగా మారారు అని చెప్పారు. ప్రస్తుత రోజుల్లో ప్రపంచం ఎలా తయారైందంటే ఆడవారేది చెబితే అదే నమ్ముతున్నారు. వారు మాట్లాడేది అబద్దమైనా పరిగణలోకి తీసుకుంటున్నారు.’ అని అలోక్ నాథ్ వాపోయారు.
బాలీవుడ్ లో సంచలనం రేపుతున్న మీ టూ మీడియాలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, మాజీ ఎడిటర్ ఎంజే అక్బర్..హోటల్ రూమ్ల్లో ఇంటర్వ్యూ నిర్వహించే సమయంలో, పని గురించే చర్చించే సమయంలో తమతో అసభ్యకరంగా వ్యహరించినట్టు మహిళా జర్నలిస్ట్లు ఆరోపిస్తున్నారు. గతేడాది అక్బర్ అసలు రంగును బయటపెట్టిన ప్రియ రమణి అనే జర్నలిస్ట్ తాజాగా అక్బరే తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ధృవీకరిస్తూ... ట్వీట్ చేసింది.
అక్బర్ ప్రస్తుతం నైజిరియాలో ఉండటంతో మహిళా జర్నలిస్టుల ఆరోపణలపై స్పందించలేదు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను అక్బర్పై వస్తున్న ఆరోపణలపై ప్రశ్నించగా.. ఆమె ఏమీ పట్టనట్లు వెళ్లిపోవడం విస్మయం కలిగించింది. మీ టూ ఉద్యమంలో రోజుకోక బాధితురాలు తమ దీనగాథను బయటపెడుతున్నారు. సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారి అసలు రంగును బయటపెడుతున్నారు.