యువ హీరోలతో సినిమా చాన్స్ లను కొట్టేసి, దక్షిణాది సినీ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మెహరీన్ కు రైల్లో ఓ భయానక అనుభవం ఎదురైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం తమిళ చిత్రం 'నోటా'లో నటిస్తున్న ఆమె, సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ నుంచి చెన్నైకి ఆమె ప్రయాణం చేయాల్సి వుండగా, విమానంలో టికెట్ దొరకక పోవడంతో రైల్లో ప్రయాణించేందుకు అంగీకరించిందట. అయితే నిర్మాతలు తన కోసం బుక్ చేసిన బెర్త్ను అప్పటికే ఒక వ్యక్తి ఆక్రమించుకోవడం, అతను పుల్గా మద్యం తాగి ఉండడంతో నటి మెహరీన్ భయంతో వణికిపోయింది. చాలా సమయం అలానే రైలులో నిలబడే ప్రయాణం చేసింది. ఆ తరువాత పరిస్థితిని నిర్మాతకు ఫోన్ చేసి చెప్పడంతో ఆయన ఒక కారులో తన మనుషులను పంపి ఆమెను అదే కారులో చెన్నైకి తీసుకురావడానికి ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని నోటా చిత్ర వర్గాలు తెలిపాయి. నిజం చెప్పాలంటే సెలబ్రిటీలకు రైలు ప్రయాణమే కాదు, ఫ్లైట్ ప్రయాణాల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే నడిగర్ సంఘ నిర్వాహకులు హీరోహీరోయిన్ల ప్రచారంలో తగిన భద్రత కల్పించాలని నిర్మాతలకు సూచిస్తున్నారు. అయినా నటి మెహరీన్కు ఎదురైన లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.