పత్తికొండ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి దారుణ హత్య కేసులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్ బాబుకు డోన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెరుకులపాడు నారాయణరెడ్డి గత ఏడాది మే 22వతేదీన దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ కేసులో కేఈ కుటుంబంపై మొదటి నుంచీ ఆరోపణలు వచ్చాయి. కేఈ కొడుకు శ్యామ్బాబే నారాయణరెడ్డిని హత్య చేయించాడన్న ఆరోపణలొచ్చాయి. కాగా... తన భర్త నారాయణరెడ్డితో పాటు మరో వ్యక్తిని అతి కిరాతకంగా హత్యచేసిన శ్యామ్బాబు అనుచరులు ఆ తరువాత పోలీసులపై ఒత్తిడి తెచ్చి చార్జీషీట్లో పేర్లు తొలగించుకున్నారని నారాయణరెడ్డి భార్య శ్రీదేవి డోన్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈకే కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్బాబు, ఆస్పరి జెడ్పీటీసీ బొజ్జమ్మ, వెల్దుర్తి ఎస్ఐ నాగప్రసాద్లపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.