మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'భరత్ అనే నేను' చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. అయితే, సినిమా కోసం పని చేసిన కొందరికి దానయ్య రెమ్యునరేషన్ చెల్లించలేదనే వార్తలు వెలువడ్డాయి. కొరటాల శివ, హీరోయిన్ కైరా అద్వానీలకు ఆయన పూర్తి రెమ్యునరేషన్ చెల్లించలేదనే వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.
దీంతో తాజాగా దానయ్య ఓ ప్రకటన విడుదల చేశారు.`మా నిర్మాణ సంస్థ మీద వచ్చిన నిరాధారమైన ఆరోపణలు మమ్మల్ని ఎంతో బాధించాయి. `భరత్ అనే నేను`లాంటి బ్లాక్బస్టర్ చిత్రానికి పనిచేసినందుకు మేము, మా టీమ్ అంతా ఎంతో గర్వపడుతుంటాం. ఈ సినిమా కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ పారితోషికాలు చెల్లించాం. ఈ విషయంలో ఎవరికైనా అనుమానాలు ఉంటే హైదరాబాద్లోని మా కార్యాలయానికి గాని, మా సినిమాలో పనిచేసిన నటీనటులను గాని సంప్రదించవచ్చు. ఇకపై ఇలాంటి ఊహాజనిత వార్తలు ప్రచురించవద్దని జర్నలిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నాన`ని దానయ్య ఆ ప్రకటనలో పేర్కొన్నారు.