అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. ధడక్ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. తొలి షో నుంచే ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. జాన్వీ అద్భుతంగా నటించిందనే ప్రశంసలు దక్కుతున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ధడక్ చిత్రం సంచలనాలు మొదలుపెట్టింది. విడుదలైన రోజే 8. 71 కోట్ల రూపాయలు వసూలు చేయడం ద్వారా.. నూతన తారలతో రూపొంది, తొలిరోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఘనత సాధించింది. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. ‘ధడక్కు గొప్ప ఆరంభం.. నూతన తారలతో రూపొందినప్పటికీ తొలిరోజే 8.71 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ పేరిట ఉన్న రూ. 8 కోట్ల రికార్డును అధిగమించిందంటూ’ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. కాగా ఈ రెండు సినిమాలు కరణ్ జోహారే నిర్మించారు. ‘ధడక్’ సినిమాలో జాన్వీకి జోడీగా షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ నటించాడు. ‘బియాండ్ ద క్లౌడ్స్’ సినిమాలో సహాయక పాత్రలో నటించిన ఇషాన్కు హీరోగా మాత్రం ఇదే తొలి చిత్రం.