జగిత్యాల... కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు కీలకమైన నియోజకవర్గం. జగిత్యాలలో గులాబీ జెండా ఎగరేయాలని కారు... పట్టు నిలుపుకోవాలని హస్తం... ఇలా ఎవరికి వారు అదును కోసం చూస్తుంది. రసవత్తరంగా మారిపోతున్న జగిత్యాల నియోజకవర్గంలో పోటాపోటీగా కొనసాగుతోంది రాజకీయం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల సీటుపై టీఆర్ఎస్ కన్నేసింది. ఎంపీ కవిత పార్లమెంట్ నియోజవర్గంలో ఉండే జగిత్యాలలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. మున్సిపాలిటి కూడా హస్తం చేతిలోకే వెళ్లిపోయింది. దీంతో జగిత్యాల నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీకి తీరని ఆశగానే మిగిలింది. ఈ ఎన్నికల్లో కచ్చింతంగా జగిత్యాలలో గులాబీ జెండా ఎగరేయాలని టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. 2014లో పోటీ చేసిన సంజయ్కుమార్కే తిరిగి మళ్లీ టికెట్ ఇచ్చింది అధిష్టానం. కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశాలున్న జీవన్రెడ్డికి మాస్ లీడర్గా మంచి పేరుంది.
అలాంటి జీవన్రెడ్డిని ఓడించాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్కుమార్ ఒక్కడి వల్లే కాదు. అందుకే ఎంపీ కవిత కూడా రంగంలోకి దిగారు. తనదైన స్టైల్లో వ్యూహాలకు పదును పెడుతున్నారు కవిత. నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ అమలుచేసిన సంక్షేమ పథకాలను ఈ ఎన్నికల్ల వాడుకునేందుకు సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్దితిల్లో అయినా జగిత్యాల సీటును దక్కించుకోవాలన్న కసితో ఉంది గులాబీ పార్టీ. గులాబీ పార్టీకి అన్నీ తానై కౌంటర్ ఇస్తున్నారు జీవన్రెడ్డి. అందుకే పోటీ కాస్తా జీవన్రెడ్డి వర్సెస్ కవితగా మారిపోయింది. రాజకీయ విమర్శలు కూడా వీరద్దరి మద్యే పోటాపోటిగా సాగుతుండటంతో ఉత్కంఠ పెరిగిపోయింది. సమావేశాలు కూడా కాకరేపుతున్నాయి.
మరోవైపు ఎంపీ కవిత కూడా సైలెంట్గా తన రాజకీయ చతురతతో తన పనితాను చేసుకుంటూ పోతున్నారు. జీవన్రెడ్డికి సన్నిహితంగా ఉండే చాలా మందిని పార్టీ కండువ కప్పేశారు. మరోవైపు నియోజకవర్గంలోని అన్ని కులసంఘాలకు ఇప్పటికే భవనాలు కేటాయించారు. ఇలా కవిత- జీవన్రెడ్డిల మద్య జగిత్యాలలో కోల్డ్ వారే నడుస్తోంది. జగిత్యాలలో ఎవరు గెలుస్తారు..ఎవరి పంతం నెగ్గించుకుంటారో వేచి చూడాలి.