మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘అరవింద సమేత’. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని సంస్థ నిర్మిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం ఈ సినిమా టీజర్ను నేడు చిత్రబృందం విడుదల చేసింది. జూనియర్ ఎన్టీఆర్ చేసిన అదిరిపోయే యాక్షన్ సీన్తో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఇందులో జగపతి బాబు డైలాగ్స్, ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. కంట పడ్డావా కనికరిస్తానేమో, వెంటపడ్డానా నరికేస్తా అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానుల రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తున్నాయి. ‘అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రధమార్ధంలో సిద్ధార్ధ్ గౌతమ్ పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్ ద్వితీయార్ధంలో వీర రాఘవగా కనిపించి అలరించనున్నాడట. సెకండాఫ్ లో ఎన్టీఆర్ పాత్ర పవర్ఫుల్ గా ఉండడంతో పాటు ఇది పూర్తి రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని సమాచారం.