మహాకూటమి ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడం, వినాయక నిమజ్జనంతో, నిన్నటి వరకు ప్రచార బరిలోకి దిగలేదు కేసీఆర్. వినాయక చవితి సంబరాలు కూడా ముగియడంతో, ఇక క్యాంపెన్లో దూసుకుపోవాలని డిసైడయ్యారు. ఎన్నికల్లో 50 రోజుల్లో వంద సభలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ఇదివరకే నిర్ణయించారు. ప్రతీ రోజు రెండేసి నియోజకవర్గాల్లో సభలుంటాయని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోలేదు.
వంద సభలు నిర్వహించడానికి సమయం ఉంటుందా? లేదా? అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. సభలను కుదించి, ప్రతీ జిల్లా కేంద్రంలో రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున జరపాలన్న తాజా ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు కేసీఆర్. దీని ద్వారా 25 నుంచి 31 రోజుల్లో సభలను ముగించాలని భావిస్తున్నారు. ఎన్నికల గడువును ప్రాతిపదికగా తీసుకొని, ప్రచార బరిలోకి దిగాలని ఆలోచిస్తున్నారు కేసీఆర్. మొత్తానికి కేవలం తన ఇమేజ్తోనే ఎన్నికల్లో గట్టెక్కుతామని కేసీఆర్ కాన్ఫిడెన్స్గా ఉంటే, అటు గులాబీ దళపతే తమను గెలుపు తీరాలకు చేరుస్తాడని అభ్యర్థులు దీమాగా ఉన్నారు. తమతమ నియోజకవర్గాల్లో, కేసీఆర్ సభలు ఎప్పుడుంటాయోనని ఎదురుచూస్తున్నారు.