అదే సీన్ రిపీటైంది. వన్డే సిరీస్ ని 2-1తో గెలుచుకొన్న టీమిండియా, టీ20 సిరీస్ ని కూడా అదే తేడాతో నెగ్గింది. తిరువనంతపురంలో తుది వరకు ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో కివీస్ జట్టుని 6 పరుగులతో చిత్తు చేసింది. వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో భారత్ విజయ దుందుభి మోగించింది.
టీ20 కింగ్స్ కివీస్ తో జరిగిన మూడు టీ20ల సిరీస్ ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. తిరువనంతపురంలో జరిగిన మ్యాచ్ లో బ్లూ బ్రిగేడ్ 6 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ను ఎనిమిది ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, ఐదు వికెట్లకు 67 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఔట్ఫీల్డ్ తడిగా ఉండటంతో భారీ స్కోరు నమోదుకాలేదు. కివీస్ బౌలర్లు తెలివిగా స్లో బాల్స్ తో భారత బ్యాట్స్మెన్ భారీ షాట్లు కొట్టకుండా కట్టడి చేశారు.
రెండు ఓవర్లలో 14 పరుగులు మాత్రమే చేసిన ఓపెనర్లు సౌదీ వేసిన మూడో ఓవర్ లో వరుసగా అవుటయ్యారు. భారత్ బ్యాట్స్మెన్లలో రోహిత్ శర్మ 8, శిఖర్ ధావన్ 6, విరాట్ కోహ్లీ 13, శ్రేయాస్ అయ్యర్ 6, మనీష్ పాండే 17, హార్దిక్ పాండ్య 14 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, ఇష్ సోధీ చెరో రెండు వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ ఒక వికెట్ తీశారు.
సాధారణ విజయలక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ను భారత బౌలర్లు నిలువరించారు. భారీ షాట్లతో విరుచుకుపడబోయిన కివీస్ టాపార్డర్ బ్యాట్స్మెన్ను కట్టి పడేశారు. దీంతో గప్టిల్, మున్రో, విలియమ్సన్ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. గ్లెన్ ఫిలిప్స్ 11, గ్రాండ్హోం 17 పరుగులు చేసి చివరి వరకు పోరాడి మ్యాచ్ ను ఉత్కంఠభరితంగా మార్చారు. బుమ్రా 2, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. యువ పేసర్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.