దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ని మరోసారి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం.. ఈ విషయాన్నీ కేంద్ర హోం శాఖ ప్రకటించింది. కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు టీటీడీ శ్రీవారి దర్శనం ఈనెల 31వరకు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకూ స్వామివారికి ఆగమశాస్త్రం ప్రకారం సేవలు, కైంకర్యాలను ఏకాంతంగానే కొనసాగించనున్నారు.
ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులను అమలు చేయనున్నట్లు టీటీడీ ఉన్నతాధికారులు ఆదివారం స్పష్టం చేశారు. లాక్డౌన్ ముగిసిన అనంతరం శ్రీవారి దర్శనానికి ఎంత మంది భక్తులను అనుమతించాలి, వారి ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టైమ్స్లాట్ ద్వారా యాత్రికులకు దర్శన టికెట్ల కేటాయింపుపై ఈ నెల 28న వీడియో కాన్ఫరెన్స్ విధానంలో జరిగే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.