కేజీల బరువు ఉండే బ్యాగుల కన్నా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆశే చిన్నారులను ఫీట్లు చేయిస్తోంది. పుస్తకాల భారం కన్నా నడిచే దారి భారమైనా తప్పక స్కూల్ బాటపడుతున్నారు. పాఠశాలలకు వెళ్లే దారులు అష్టదిగ్భందనం చేసినా చదువుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. స్కూల్లో అడుగుపెట్టాలంటే ప్రమాదకరమైన ఫీట్లు చేయాల్సివస్తోంది. అసలు విద్యార్ధులకు వచ్చిన కష్టమెంటో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్కావాల్సిందే.
ఇది కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామానికి చెందిన విద్యార్ధులుపడుతున్న కష్టం. నాలుగేళ్లుగా చదువుకునేందుకు విద్యార్ధులు అష్టకష్టాలు పడుతున్నారు. మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకునేందుకు విద్యార్ధులు స్కూల్ గొడలు ఎక్కి దుంకుతున్నారు. మెయిన్ గేట్తో పాటు రెండు గేట్ల ఉన్న దారులను ఆక్రమదారులు కబ్జా చేయడంతో ముళ్లకంచెల్లోనే నడుస్తున్నారు. స్కూల్లో అడుగుపెట్టాలంటే ఎత్తైన గోడలు ఎక్కాల్సిందే. చిన్నపిల్లలు, ఆడపిల్లలు గోడలు ఎక్కి దూకి మరీ చదువుకుంటున్నారు.
2001లో వెంకటేశ్వరరావు అనే దాత స్కూల్కు తన స్థలాన్ని ఇవ్వడంతో పాటు పాఠశాలను నిర్మించాడు. అప్పట్లో స్కూల్కు వెళ్లేందుకు మూడు వైపులా దారులు కూడా ఉండేవి. అయితే 2009తో పాఠశాలకు పక్కనున్న భూములను కొందరు కొనుకున్నారు. స్కూల్కు వెళ్లే మరోదారిలో పంటపొలాలు ఉన్నాయి. దీంతో స్ధలం కొన్నవారు పొలం యజమానులు స్కూల్కు ఉన్న దారిని మూసేయడంతో పాటు బండరాళ్లను అడ్డుపెట్టారు. దీంతో స్కూల్కి వెళ్లే మూడుదారులు మూసుకుపోవడంతో తప్పక గోడలు ఎక్కిదూకుతున్నారు పిల్లలు.
స్కూల్కు సరైన దారి లేకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్ధులు ఆవేదన చెందుతున్నారు. గోడలు ఎక్కి దూకడం వల్ల కాళ్లు, చేతులు విరుగుతున్నాయని విద్యార్ధులు వాపోతున్నారు. విద్యార్ధులు పడుతున్న కష్టాలపై విద్యాశాఖ, తహశీల్థార్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. మరోవైపు తమ బిడ్డలకు టీసీలు ఇస్తే మరో పాఠశాలలో చేర్చుకుంటామని తల్లిదండ్రులు అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్తో పాటు విద్యాశాఖ అధికారులు స్పందించి పిల్లలు పడుతున్న కష్టాలను తీర్చాలని స్ధానికులు వేడుకుంటున్నారు. స్కూల్ కు వెళ్లేదారులను మూసేసిన అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.