విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కేంద్రహోంశాఖ,విపత్తు నివారణ శాఖాధికారులతో ఆయన మాట్లాడారు. సహాయక చర్యలు వెంటనే ముమ్మరం చేయాలని ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నామన్నారు. గ్యాస్ లీకేజీ ఘటనలో అస్వస్థకు గురైన వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు.
ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డికి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలను జగన్ ప్రధాని మోదీకి వివరించారు. పరిస్థితి అదుపులోనే ఉందని, బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు ఉంటాయని ప్రధాని మోదీ భరోసా ఇచ్చినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.