నేడు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాళులర్పించారు. ఈ మేరకు తాను ట్విటర్ వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ట్వీట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మమతా ట్యాగ్ చేశారు. మరోవైపు వైఎస్సార్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ప్రముఖలు ఘనంగా నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వైఎస్పార్ చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ నివాళలర్పించారు. ఇరు రాష్ట్రాల్లోని వైఎస్సార్ అభిమానులు పలు సేవ కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని చోట్ల అన్నధాన కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహిస్తోంది. సోమవారం ఉదయం రాజన్న తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.