ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ చెప్పుకొచ్చిన కేంద్రం తాజా చర్యలతో ఆ డిమాండ్ ఇంకా సజీవంగా ఉందని తెలుస్తోంది. సీఎం జగన్ గత మే 26 న ప్రధాని మోడీని కలిసి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న విజ్ఞప్తిని 15 వ ఆర్థిక సంఘానికి నివేదించినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. లోక్సభలో కాకినాడ ఎంపీ వంగా గీత అడిగిన ప్రశ్నకు నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. కేంద్రం సమాధానంపై ఎంపీ వంగా గీత హర్షం వ్యక్తం చేశారు. హెచ్ ఎం టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె విభజన హామీలు సాధిస్తామనే నమ్మకం ఉందని తెలిపారు.