ఔషధాలు తెచ్చినందుకు ఐదేళ్ల జైలు శిక్ష

ఔషధాలు తెచ్చినందుకు ఐదేళ్ల జైలు శిక్ష
x
Highlights

పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అన్న సామెత ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. ఇప్పుడు అది ఓ వ్యక్తి విషయంలో నిజమైంది. సన్నిహితుల కోసం మందులను తీసుకెళ్లిన...

పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అన్న సామెత ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. ఇప్పుడు అది ఓ వ్యక్తి విషయంలో నిజమైంది. సన్నిహితుల కోసం మందులను తీసుకెళ్లిన పాపానికి ఓ వ్యక్తి అన్యాయంగా ఐదేళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు. అంతే కాదండీ పాపం కొరడా దెబ్బలు కూడా తిన్నాడు. అయితే ఆ ట్యాబ్లెట్లు తెమ్మన్న హైదరాబాద్‌కు చెందిన దంపతులతో పాటు మరో యువకుడికి కూడా జైలు శిక్ష, కొరడా దెబ్బలు తప్పలేదు. అసలు మందులు తీసుకొస్తే జైలు శిక్ష ఏంటి, కొరడా దెబ్బలు ఏంటి అనుకుంటున్నారా. స్నేహితుడి కోరిక మేరకు ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి పరాయి దేశానికి కొన్ని ట్యాబ్లెట్లను తీసుకెళ్లాడు. వాటిని తీసుకెళ్లడం ఏంటో కానీ అక్కడే జైలు శిక్ష అనుభవించాడు. శిక్షను అనుభవించిన ఆ వ్యక్తి చివరికి ఇటీవలే స్వదేశానికి చేరుకున్నాడు.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే రియాద్‌‌లోని ఒక బ్యాంకులో హైదరాబాద్‌‌లోని లంగర్‌హౌజ్‌కు చెందిన అబ్దుల్‌ వహీద్‌ (37) అనే వ్యక్తి పని చేస్తున్నాడు. అయితే ఇతనికి 2015లో కూతురు పుట్టింది. దీంతో అతను ఆ పాపను చూసేందుకు ఎంతో ఆశతో అప్పుడు హైదరాబాద్ వచ్చాడు. కొన్ని రోజులు కుటుంబ సభ్యులతో గడిపిన ఆయన తిరుగు ప్రయాణానికి సిద్దం అయ్యాడు. అదే సమయంలో రియాద్‌లో పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన మోయిజ్‌ అనే తన స్నేహితులు ఇచ్చిన పార్సిల్ తీసుకురావాలని వహీద్‌ను కోరాడు. దాంతో వహీద్ స్నేహితునికి సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ ట్యాబ్లెట్ల పెట్టెతో విమానం ఎక్కి రియాద్‌లో దిగాడు. అప్పటి వరకు బాగానే ఉంది. ఇక రియాద్ లో వహీద్ విమానం దిగగానే కస్టమ్స్‌ అధికారులు అతన్ని తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో అధికారులకు ట్యాబ్లెట్ల డబ్బా దొరికింది, అవి మందులే కదా ఒదిలేయవచ్చు కదా అనుకోవచ్చు కానీ అక్కడ ఆ మందులను సౌదీలో పూర్తిగా నిషేధించారు. దీంతో వహీద్‌ను పోలీసులు వెంటనే అరెస్టు చేసి విచారించారు. ఆ విచారణలో వహీద్ జరిగిన విషయాన్ని పూర్తిగా చెప్పాడు. దీంతో సౌదీ పోలీసులు బదర్‌ను కూడా అరెస్టు చేశారు. ఆ తరువాత బదర్ ను విచారించగా సౌదీలో మందుల ఖరీదు ఎక్కువగా ఉండటంతో వాటిని హైదరాబాద్‌ నుంచి తెప్పించానని, తన భార్య హజ్రాకు అనారోగ్యం, నిద్రలేమి సమస్య ఉందని చెప్పాడు. వారి మాటలను విన్న పోలీసులు ఇంకా లోతుగా విచారణ చేపట్టారు. ఆ విచారణలో బదర్‌ భార్య గతంలో ఈ మందులను వాడలేదని తేలింది.

దీంతో పోలీసులు ఈ కేసును కోర్టుకు అప్పగించారు. న్యాయస్థానం ఈ కేసుపై విచారణ జరిపి నలుగురినీ దోషులుగా తేల్చి శిక్ష వేసింది. మోయిజ్‌కు రెండున్నరేళ్ల జైలు, 300 కొరడా దెబ్బలు, మందు బిళ్లలను తెప్పించిన బదర్‌, హజ్రాకు 5 సంవత్సరాల జైలు శిక్ష, 500 కొరడా దెబ్బలు, లక్ష రియాళ్ల జరిమానా, వహీద్‌కు 8 సంవత్సరాల జైలు శిక్ష, 800 కొరడా దెబ్బలు, లక్ష రియాళ్ల (రూ.20 లక్షలు) జరిమానా విధించాలని కోర్టు తీర్పిచ్చింది. అయితే ఇటీవల సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ మానవతా దృక్పథంతో క్షమాభిక్ష ప్రకటించడంతో అబ్దుల్‌ వహీద్‌ శిక్ష గడువుకు ముందే విడుదల అయి స్వదేశానికి చేరుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories