కమెడియన్ కాదర్ ఖాన్ కన్నుమూత
బాలీవుడ్ సీనియర్ నటుడు, రచయిత ఖాదర్ ఖాన్ కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన కెనడాలో తుదిశ్వాస విడిచారని ఖాదర్ ఖాన్ కుమారుడు సర్ఫరాజ్ వెల్లడించారు.
బాలీవుడ్ సీనియర్ నటుడు, రచయిత ఖాదర్ ఖాన్ కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన కెనడాలో తుదిశ్వాస విడిచారని ఖాదర్ ఖాన్ కుమారుడు సర్ఫరాజ్ వెల్లడించారు. కుటుంబ సభ్యులందరూ కెనడాలోనే ఉన్నందున అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. ఖాదర్ ఖాన్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ దిగ్గజ నటుడు అమిత్బాబ్ బచ్చన్ సంతాపం ప్రకటించారు. తన అద్భుత నటనతో వెండి తెరకు మరింత మెరుగులు దిద్దారని మోదీ పేర్కొన్నారు. రచయితగా కూడా గొప్ప సినిమాలు అందించారని కొనియాడారు. ఖాదర్ ఖాన్ మరణ వార్త కలచివేసిందని అమితాబ్ అన్నారు. గొప్ప ప్రతిభావంతుడైన ఆయనను కోల్పోవడం బాధాకరమని ట్వీట్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన దో ఔర్ దో పాంచ్, ముకద్దర్ కా సికిందర్, మిస్టర్ నట్వర్లాల్, సుహాగ్, షహేన్షా సినిమాలు ఘన విజయం సాధించాయి.
అఫ్గానిస్థాన్లోని కాబూల్లో జన్మించిన ఖాదర్ ఖాన్ 1973లో వచ్చిన ధాగ్ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. 300లకు పైగా చిత్రాల్లో నటించారు. 250 పైగా సినిమాలకు డైలాగులు రాశారు. మాటల రచయితగా ఆయన మొదటి సినిమా జవానీ దివానీ. హాస్య పాత్రలకు పేరుగాంచిన ఖాన్ దర్శకుడు డేవిడ్ ధావన్ సినిమాల్లో ఎక్కువగా నటించారు. అమితాబ్తో పాటు రాజేశ్ ఖన్నా, జితేంద్ర, ఫిరోజ్ ఖాన్, అనిల్ కపూర్, గోవిందా తదితర ప్రముఖ నటులతో ఖాదర్ ఖాన్ తెర పంచుకున్నారు.