మహర్షికి ఉపరాష్ట్రపతి ప్రశంసలు

Update: 2019-05-15 11:20 GMT

రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న మహర్షికి ప్రముఖుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మహర్షి సినిమా చూసి స్పందించారు. మహేష్ బాబు ను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా ఆయన తన ప్రశంసల జల్లులు కురిపించారు. మహర్షి చిత్రం సందేశాత్మకంగాబాధ్యతా యుతంగా ఉందని ఆయన పొగిడారు. దానికి మహేష్ బాబు కూడా వెంటనే స్పందించారు. వెంకయ్య నాయుడికి తన కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మొత్తమ్మీద మహేష్ బాబుకి మహర్షి అద్భుతమైన సినిమాగా నిలిచిపోయింది.

వెంకయ్యనాయుడి ప్రశంస ఇది..

'కుటుంబ సభ్యులతో కలసి మహర్షి చిత్రాన్ని చూశాను. గ్రామీణ నేపథ్యంలో వ్యవసాయ పరిరక్షణ, అన్నదాతకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతని తెలియజేసేలా చిత్రాన్ని రూపిందించారు. ఇది ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి చిత్రం. మహేష్ బాబు సహజసిద్ధమైన నటన కనబరిచాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్రాన్ని చక్కగా చిత్రీకరించారు. నిర్మాతలతో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు' అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.

మహేష్ స్పందన ఇది..

వెంకయ్య నాయుడు ట్వీట్ కు మహేష్ ప్రతిస్పదించాడు. సర్ ఈ చిత్రాన్ని మీరు చూడడం, అది మీకు నచ్చడం మా మహర్షి చిత్రయూనిట్ మొత్తానికి దక్కిన గౌరవం. మీ మాటలు ఇలాంటి మరిన్ని చిత్రాలని చేసేందుకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. మహర్షి చిత్ర యూనిట్ తరుపున మీకు కృతజ్ఞతలు అని మహేష్ తెలిపాడు. 

Similar News