నవ్యాంధ్ర రెండో సీఎంగా జగన్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అందంగా ముస్తాబైంది. సరిగ్గా నేటి మధ్యాహ్నం 12గంటల 23 నిమిషాలకు సీఎంగా జగన్ ప్రమాణం చేయనున్నారు. ప్రమాణస్వీకారం కోసం ఒక స్టేజ్, అతిథుల కోసం మరో స్టేజ్ ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఉన్నాతాధికారులు, అభిమానులు, జనం కోసం ప్రత్యేక గ్యాలరీలు వున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెడ్డి చేయనున్న పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు జగన్ చేత గవర్నర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. రెండు ప్రధాన స్టేజ్ లతో ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని ప్రమాణస్వీకారం స్టేజ్ వద్దకు జగన్ ఓపెన్ టాప్ జీప్ లో వస్తారు. స్టేడియం చుట్టూ అతిథులు, అభిమానులకు అభివాదం చేసి ప్రమాణస్వీకారం కోసం ఏర్పాటు చేసిన ప్రధాన స్టేజ్ వద్దకు చేరుకుంటారు. ఈ స్టేజ్ లో జగన్ తో పాటు గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆశీనులవుతారు.
మరో స్టేజ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు ఉంటారు. అతిథులు, అభిమానులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం వెల్లడించారు. ప్రముఖుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. జడ్జిలకు ఓ గ్యాలరీ, ఎంపీలు, ఎమ్మెల్యేలకు మరో గ్యాలరీని కేటాయించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు, ఇతర వీఐపీలకు మరో గ్యాలరీ వుంది.
ప్రజలు, కార్యకర్తలు కోసం మరో గ్యాలరీ కేటాయించారు. దాదాపు 30వేల మంది వీక్షించే విధంగా ఈ గ్యాలరీల్లో సదుపాయాలు కల్పించారు. గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు గ్రే హౌండ్స్, డ్రోన్స్, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణంలోనూ, బయట కూడా ప్రజలు వీక్షించేలా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. దీంతో సామాన్యులు, కార్యకర్తలు జగన్ ప్రమాణ స్వీకారాన్ని వీక్షించవచ్చు.