ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ ఐదు పోలింగ్ బూత్లలో రీ పోలింగ్కు ఆదేశించడాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వాగతించారు. ఈ అంశంలో చంద్రబాబు నాయుడు స్పందిస్తున్న తీరును కూడా జగన్ తీవ్రంగా తప్పు పట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలో దళితుల్ని ఓటు వేయకుండా చేసి వారి ఓట్లు టీడీపీ నేతలే వేయడం అప్రజాస్వామికమా? లేక అక్కడి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి టీడీపీ నేతల అరాచకాలకు అడ్డుపడడం అప్రజాస్వామికమా అని చంద్రబాబుపై జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రగిరిలోని ఐదు పోలింగ్ బూత్లలో రీ పోలింగ్ నిర్వహించే అంశంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎందుకంతగా గగ్గోలు పెడుతూ ఉన్నారు? అసలు ఏ తప్పూ చేయనప్పుడు రీ పోలింగ్ కు ఎందుకు భయపడుతూ ఉన్నారు? అని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు.
ఈసీ నిర్ణయంపై సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై శుక్రవారం రాత్రి జగన్మోహన్రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన తప్పు ఏమిటని? టీడీపీ పార్టీ అరాచకాలకు అడ్డు పడటమా? అని జగన్ ప్రశ్నించారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో రీ పోలింగ్ జరిగే చోట ప్రజాస్వామ్యయుతంగా ఓటింగ్ జరిగేలా చూడాలని జగన్ ఎన్నికల కమిషన్ ను కోరారు.