హైదరాబాద్లో రేపు జరగనున్న శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసులు, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శోభాయాత్ర జరిగే మార్గం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా 2500మంది పోలీసులతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. శోభాయాత్ర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న హైదరాబాద్ సీసీ అంజనీకుమార్ శాంతియుత వాతావరణంలో పండగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్లో జరగనున్న శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసులు, అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర జరగనున్న మార్గాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు స్ట్రీట్ లైట్ల మరమ్మతు, ట్రాఫిక్ మళ్లింపుపై చర్యలు చేపట్టారు. శోభాయాత్రలో పాల్గొనే నాయకులు, భక్తులు సంయమనం పాటించి పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ కోరారు.
సీతారాంబాగ్ ఆలయం నుంచి దూల్పేట్, అఫ్జల్గంజ్, గౌలిగూడ మీదుగా హనుమాన్ వ్యాయామశాల వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. దాంతో ఈ మార్గంలోని 25 ప్రార్థనా మందిరాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 2500 పోలీసులతో బందోబస్తు చర్యలు చేపట్టారు. సమస్మాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్, టాస్క్ ఫోర్స్, అదనపు బలగాలతో పికెటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే 250 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు. ఇక శోభాయాత్ర జరిగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే మద్యం విక్రయాలను రద్దుచేసి రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. శోభాయాత్రలో మూడు వేల మందికి పైగా పాల్గొనే అవకాశముందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దాంతో అందుకు తగ్గట్టుగా రోడ్డు పొడవునా మంచినీటి సరఫరాలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.