పాలమూరులో పర్యాటక శోభ..
అక్కడ అంతా ఆహ్లాదం, ఆకట్టుకునే పచ్చదనం, ఆ ప్రదేశానికి వెళ్తే ఎంతో ప్రశాంతత. మరెంతో ఆనందం. పిల్లల పార్కులు, ఆకట్టుకునే అడ్వెంచర్ జోన్లు, వంతెనలు ఇలాంటి ఎన్నో విశేషాలతో సందర్శకులను కనువిందు చేస్తోంది.
అక్కడ అంతా ఆహ్లాదం, ఆకట్టుకునే పచ్చదనం, ఆ ప్రదేశానికి వెళ్తే ఎంతో ప్రశాంతత. మరెంతో ఆనందం. పిల్లల పార్కులు, ఆకట్టుకునే అడ్వెంచర్ జోన్లు, వంతెనలు ఇలాంటి ఎన్నో విశేషాలతో సందర్శకులను కనువిందు చేస్తోంది. ఆహ్లాదాన్ని పంచుతూ హాలీడేస్ను జాలీడేస్గా మార్చేస్తోంది. రోజురోజుకూ సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ పర్యాటక క్షేత్రం ఎప్పటికప్పుడు కొత్తదనం పంచుతూ పర్యాటక శోభను సంతరించుకుంటుంది.
ఇలాంటి ఎన్నో విశేషాలతో సందర్శకులను కనువిందు చేస్తున్న పర్యాటక ప్రాంతం మహబూబ్నగర్ జిల్లాలోని హరితవనం పార్క్ సొంతం. జిల్లాకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలమూరు హరిత వనం పార్క్ ఓ అందాల తోరణం. బెంగళూరు బృందావనం పార్క్ను తలదన్నేలా రూపుదిద్దుకున్న వనం పర్యాటకప్రియులను తెగ ఆకర్షిస్తోంది. ఎటుచూసినా ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా తీర్చిదిద్దిన వనంలో రంగురంగుల పూలమొక్కలు కనువిందు చేస్తున్నాయి. నర్సరీగా ప్రారంభమైన 300 ఎకరాల రిజర్వ్ ఫారెస్టు పర్యాటక ప్రదేశంగా రూపు దిద్దుకుంది.
మయూరి పార్క్గా పిలిచే హరితవనం పార్క్ ఎంట్రెన్స్ నుంచి ఎన్నో విశేషాలకు నెలవు. పార్కులో అడుగు పెట్టిన వెంటనే ఆకట్టుకునే పచ్చదనం, పిల్లల కోసం ప్రత్యేక పార్కు వంతెనలు, సాహస శిబిరాలు ఆకట్టుకునే బొమ్మలు చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాక పచ్చని చెట్ల మధ్య ఏర్పాటు చేసిన పల్లె వాతావరణానికి పర్యాటక ప్రియులు ఫిదా అవుతున్నారు. ఎద్దుల బడి, రైతులు, బావులు, చిన్న చిన్న గుడిసెలతో ఏర్పాటు చేసిన ఇళ్లు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి.
పార్క్లో ఏర్పాటు చేసిన జిప్లైన్, అడ్వెంచర్జోన్, రోప్వే హైలెట్గా నిలుస్తోంది. ట్రెక్కింగ్ చేయాలన్న ఆసక్తి ఉన్నవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇక చిన్నారులను ఆకట్టుకునేలా జూరాసిక్ పార్క్ తరహాలో ఏర్పాటు చేసిన సెట్టింగ్ మరో అదనపు ఆకర్షణ. పార్క్లో ఏర్పాటు చేసిన రాక్షసబల్లి. పులుల బొమ్మలు చిన్నారులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇక స్వదేశీ, విదేశీ పక్షల కిలకిలరావాలు,కలర్ఫుల్ పూల మొక్కలు పర్యాటకులను కనువిందు చేయడంతో పాటు నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
ఇక ఇక్కడికొచ్చే వారంతా స్కైసైక్లింగ్, పర్వతా రోహణ చేసేందుకు ఎగబడతారు. 5 ఫీట్ల ఎత్తులో గాలిలో తేలుతూ వెళ్లడం, 40 ఫీట్ల ఎత్తులో తీగలపై సైకిల్ తొక్కడం మరిచిపోలేని అనుభూతి. కృతిమ జలపాతం, కృత్రిమ వర్షం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇలా ఎన్నో అద్భుతాలకు నెలవైన పార్క్లో ఒక్కసారి లోపలికి వెళితే బయటకు రావడానికి మనసు ఒప్పదంటే అతిశయోక్తి కాదు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టుల కోసం అటవీశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కుటుంబసమేతంగా వచ్చిన పర్యాటకులు రిలాక్స్ అయ్యేందు టెంట్లతో కూడిన విడుదులను అందుబాటులోకి తెచ్చారు. కాలుష్యంతో విసిగిపోయిన జనం పచ్చనిగాలితో పాటు ప్రకృతి సోయగాలను తిలకించేందుకు హరితవనంవైపు క్యూ కడుతున్నారు.