ఐటీ గ్రిడ్ కేసులో కీలక మలుపు తిరిగింది. తాజాగా 40 హార్డ్ డిస్కులను ఎఫ్ఎస్ఎల్ విశ్లేషించింది. అందులో పూర్తి వివరాలను రిట్రైవ్ చేశారు. గతంలో 7 హార్డ్డిస్కులను అధికారులు విశ్లేషించారు. హార్ట్డిస్క్లో ఏపీ, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల డేటా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా దర్యాప్తును సిట్ ముమ్మరం చేసింది. బెనిఫిషరీ డేటా పూర్తిగా ఆయా ప్రభుత్వశాఖలోని అధికారుల దగ్గరి నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇక అమెజాన్ లాంటి మరో సంస్థలో డేటాను ఐటీగ్రిడ్ నిర్వాహకులు పొందుపరిచారు. టీడీపీకి సంబంధించిన డబ్బులు భారీగా ఆ కంపెనీకి అందినట్లు గుర్తించారు. క్రెడిట్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లావాదేవీలు పరిశీలించి అధికారులు నిర్దారించారు.
డేటా చోరీ కేసులో ప్రధాన నిందితుడు, ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్ను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వేట ముమ్మరం చేసింది. ప్రాథమిక విచారణ, కాల్ డేటా విశ్లేషణ ద్వారా అశోక్ ఏపీలో తలదాచుకున్నట్లు ఇదివరకే సిట్ గుర్తించింది. ఇప్పుడు అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏపీకి వెళ్లాయని, త్వరలోనే అశోక్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఐటీ గ్రిడ్ కేసులో ఇప్పటికే మూడు సార్లు నోటీసులు జారీ చేసినా అశోక్ విచారణకు హాజరుకాకపోవడంతో తప్పనిసరి సరిస్థితుల్లో అరెస్ట్ చేసేందుకు సిట్ నిర్ణయించింది.