డేటా చోరీ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొమ్మిది మందితో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వం వహించనున్నారు. కామారెడ్డి ఎస్పీ శ్వేత, సైబరాబాద్ క్రైమ్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, నారాయణపేట డీఎస్పీ శ్రీధర్, సైబర్ క్రైం డీఎస్పీ రవికుమార్ రెడ్డి, మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్రావు, సైబరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ రమేశ్, వెంకటరాంరెడ్డిలను సిట్లో సభ్యులుగా నియమించింది.
ఏపీకి సంబంధించిన డేటా చోరీ అయిందన్న వ్యవహారంపై హైదరాబాద్ జంట కమిషనరేట్ల పరిధిలో మాదాపూర్, ఎస్సార్ నగర్లో ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయి. వీటిపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా చోరీకి పాల్పడిందనే ఆరోపణలపై పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం క్లిష్టంగా మారిన నేపథ్యంలో రెండు కేసులను ఒకేసారి దర్యాప్తు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో సిట్ ఏర్పాటును కోరుతూ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులుజారీ చేసింది.
సైబర్ నేరాలపై అవగాహన కల్గిన అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. ఈ రెండు కేసుల దర్యాప్తును వెంటనే ప్రారంభించాని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దర్యాప్తు పూర్తయ్యాక కోర్టులో నివేదిక సమర్పించాలని జీవోలు పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో హైదరాబాద్, సైబరాబాద్తో పాటు రాచకొండ పోలీస్ కమిషనరేట్, సీఐడీ పోలీసుల సహకారం సైతం సిట్ తీసుకోనుంది. గురువారం నుంచి ఈ కేసు దర్యాప్తును సిట్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. డీజీపీ కార్యాలయంలో సిట్కు ప్రత్యేక ఛాంబర్ కూడా కేటాయించారు.