తెలంగాణ కాంగ్రెస్లో మాటల మంటలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్కు కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. పార్టీలో సీనియర్ నేతల మధ్య మాటల మంటలు చెలరేగాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్కు కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. పార్టీలో సీనియర్ నేతల మధ్య మాటల మంటలు చెలరేగాయి. టీడీపీతో పొత్తును తప్పుబట్టిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సీనియర్ నేత వీహచ్ తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు .కోమటిరెడ్డి పరిధి దాటి అధిష్టానాన్ని ధిక్కరించేలా మాట్లాడారంటూ వీహెచ్ తప్పుబట్టారు. పొత్తులు వద్దన్న కోమటి రెడ్డి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. టీడీపీ పొత్తుతో కొన్ని చోట్ల లాభం జరిగితే మరికొన్ని చోట్ల నష్టం జరిగిందన్నారు.
ఇక మరో సీనియర్ నేత సర్వే సత్యనారాయణ ఏకంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్గా విమర్శలు గుప్పించారు . అర్హత లేని అసమర్ధులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవులు కట్టబెట్టాడంటూ సర్వే ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని టీ పీసీసీ చీఫ్గా తొలగించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి నేతను పార్టీ ఇంకా భరించాల్సిన అవసరం ఉందా ? అంటూ ప్రశ్నించారు .పార్టీ కోసం తాను సలహాలు ఇస్తే పార్టీలోని రౌడీ మూకలు తన పట్ల దురుసుగా ప్రవర్తించాయంటూ తీవ్ర స్ధాయిలో విమర్శించారు. పార్టీలోని అన్ని అంశాలపై గాంధీ భవన్లో మీడియా సమావేశం నిర్వహిస్తానన్న సర్వే తన ప్రెస్మీట్కు అనుమతి ఇస్తారో లేదో అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. గాంధీ భవన్లోని మహాత్ముడి విగ్రహం ముందు రేపు మధ్యాహ్నం 12 గంటలకు ధర్నాకు దిగుతానంటూ ఈ సందర్భంగా హెచ్చరించారు.