నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి కేంద్రంలో చక్రం తిప్పబోతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించినప్పటికీ ఆ పార్టీకీ మెజారిటీ రాదని కాంగ్రెస్ ఆశిస్తోంది. కేంద్రంలో హంగ్ తప్పదని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు ఎన్డీయేలో లేని ప్రాంతీయ పార్టీలను దగ్గరికి లాగే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఏపీలో మెజారిటీ అసెంబ్లీ, ఎంపీ సీట్లు వైసీపీకే దక్కుతాయన్న జాతీయ చానెళ్ల ఎగ్జిట్పోల్స్ అంచనాల నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా ఎన్డీయేతర కూటమిలోకి దించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆదివారం ఓ కాంగ్రెస్ నేత ఫోన్ చేసి ఎన్డీయేతర కూటమికి తమ మద్దతివ్వాలని కోరారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతివ్వాల్సిందిగా జగన్ను సోమవారం కోరారు. అయితే, ఏ విషయమైనా మే23 ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతే తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక, ఫలితాలు దగ్గర పడుతున్న వేళ..ఈ కూటమిలో సీనియర్ నేత అయిన శరద్ పవార్ ద్వారా సోమవారం జగన్తో టచ్లోకి వచ్చినట్లు చెబుతున్నారు. శరత్ పవర్ ఫోన్ తో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అయితే ఆదివారం వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలో ఒక్క లగడపాటి సర్వే , ఐఎన్ఎస్ఎస్ సర్వే, ఎలైట్ సర్వేలు మినహాయించి దాదాపు అన్ని సర్వేల ఎగ్జిట్ పోల్స్ వైసీపీ విజయకేతనం ఎగురవేస్తుందని చెప్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఎక్కువ మెజారిటీ సాధిస్తుందని, ఇక లోకసభ ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీ కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాలు వైసీపీ అనుకూలంగా రావడంతో వైఎస్ జగన్, వైసీపీ శ్రేణులు జోష్లో ఉన్నారు.