ప్రియాంక గాంధీ వారణాసిలో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ పోటీచేస్తున్న వారణాసి లోక్సభ నియోజకవర్గంలోబీజేపీ కి ఏ మాత్రం తీసిపోని విధంగా బుధవారం ఆమె భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. మోదీ నామినేషన్ దాఖలు చేసే ముందు రోజు నిర్వహించిన రోడ్ షో మాదిరిగానే మూడు వారాల తర్వాత అదే కాంగ్రెస్ ఈ రోడ్ షోను నిర్వహించింది. బనారస్ హిందూ యూనివర్శిటీ గేటు దగ్గర ఏర్పాటుచేసిన మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి పూలమాలలు వేసి ప్రియాంక రోడ్ షో ప్రారంభించారు. దీనికి స్థానిక కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో జనసమీకరణ చేశారు. రోడ్ షో అంతటా మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన నినాదాలు మిన్నంటాయి. ఈ రోడ్ షోను దశశ్వమేథ ఘాట్ వద్ద ముగించారు. అనంతరం ప్రియాంక కాశీ విశ్వనాథ్ ఆలయానికి, కాల భైరవ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు.