దూరభారం వెళ్లాలి.. ప్రయాణం చేయాలంటే చాలా ఓర్పు అవసరం. అలాంటిది తీరా రైల్వే స్టేషన్కి వెళ్లి సమయానికి రైలు రాకపోతే.., రైలు కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తే... ఇలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మొబైల్ థియేటర్ను అందుబాటులోకి తీసుకురానున్నారు విశాఖ రైల్వే అధికారులు. 120 మంది నుంచి 150 మంది ప్రయాణికులు వీక్షించేలా ఈ థియేటర్ను డిజైన్ చేశారు. పిక్చర్ టైమ్ అనే సంస్థకు ఈ థియేటర్ కాంట్రాక్టు బాధ్యత అప్పగించారు.
విశాఖ రైల్వే స్టేషన్ నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ఉత్తరాంద్ర జిల్లాలోని వారు నిత్యం రైళ్ల కోసం ప్లాట్ఫామ్పై ఎదురుచూస్తుంటారు. రైలు వచ్చే సమయంలో కొంత మంది ఫోన్లతో కాలక్షేపం చేస్తుంటే, మరికొంత మంది కబుర్లు చెప్పుకుంటూ కాలయాపన చేస్తుంటారు. ఇలా రైలు కోసం ఎదురు చూసే ప్రయాణికుల కోసం విశాఖ స్టేషన్లో థియేటర్ నిర్మించనున్నారు.
విశాఖ రైల్వే స్టేషన్లో అందుబాటులోకి రానున్న థియేటర్లో తెలుగు, హిందీ భాషల్లో కొత్త.. పాత సినిమాలు ప్రదర్శిస్తారు. టిక్కెట్ ధర 50 రూపాయలుగా నిర్ణయించారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో సినిమాలను ప్రదర్శిస్తారు. ఈతరహా థియేటర్లు ఇప్పటికే యూపీలోని పలు రైల్వే స్టేషన్లలో ఉన్నాయి. ఇందులో భాగంగా తూర్పుకోస్తా రైల్వే జోన్లో తొలిసారిగా విశాఖ రైల్వే స్టేషన్ను ఎంపిక చేశారు.
అదేవిధంగా విశాఖ స్టేషన్లో ప్లాట్ ఫారం-1 పై గేమింగ్జోన్ ఏర్పాటు చేస్తున్నారు. రైళ్ల కోసం వేచి వుండే ప్రయాణికులు, బంధువులకు వీడ్కోలు పలికేందుకు వచ్చే పిల్లలు, యువత కోసం ఇది కాలక్షేపంగా వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతే కాదు.. ప్లాట్ఫారం-1లోనే గేట్-2 వద్ద సెల్ఫీ పాయింట్ నిర్మించనున్నారు. ఇప్పటికే క్లీనేస్ట్ రైల్వే స్టేషన్ గా పేరు తెచ్చుకున్న విశాఖ రైల్వేష్టేషన్.. ముందు ముందు ప్రయాణికులకు మరిన్ని సేవలు అందిచనుంది.