దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్ధిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ దిలీప్ పాండేకు మద్దతుగా కేజ్రీవాల్ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో మనోజ్ తివారీ నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతటితో ఆగని కేజ్రీవాల్ మనోజ్ తివారీకి పని చేయడం రాదని కేవలం డ్యాన్స్ ఎలా చేయాలో మాత్రమే తెలుసన్నారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి దిలీప్ పాండేజీకి డ్యాన్స్ చేయడం తెలియక పోయినా ఆయనకు పని చేయడం మాత్రమే వస్తుందని అన్నారు. అందుకే ఈ ఎన్నికల సమరంలో డ్యాన్స్ చేసే వాళ్లకు కాకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే వారికే ఓటేయాలి. ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. అభివృద్ధి చేసేవారిని మాత్రమే గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు స్పందించారు మనోజ్ తివారీ. తనను కించపరచడం ద్వారా కేజ్రీవాల్ పూర్వాంచల్ ప్రజలందరినీ అవమానించారని మనోజ్ తివారీ ఆరోపించారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మనోజ్ తివారీ ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు.