అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేల్లోనూ కేంద్రంలో మళ్లీ ఎన్డీఏదే అధికారమని తేలిపోవడంతో విపక్షాలు డిఫరెంట్గా స్పందిస్తున్నాయి. కాంగ్రెస్తోపాటు పలు బీజేపీ వ్యతిరేక పార్టీలు ఎగ్జిట్ పోల్ అంచనాలపై మండిపడుతున్నాయి. ఇక బెంగాల్, ఒడిషాల్లో కూడా బీజేపీ సునామీ సృష్టించబోతుందన్న అంచనాలు విపక్షాలను షాక్కి గురిచేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దాదాపు అన్ని సర్వేలూ మళ్లీ బీజేపీ కూటమే అధికారంలోకి రాబోతున్నట్లు అంచనా వేశాయి. అయితే, గత లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటిన రాష్ట్రాల్లో బీజేపీ హవా కొంత తగ్గుతుందని, ఆ లోటును పశ్చిమ బంగాల్, అసోం, ఒడిషా తదితర రాష్ట్రాల్లో భర్తీ చేసుకుంటుందని చెప్పుకొచ్చాయి.
ముఖ్యంగా బెంగాల్, ఒడిషాల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే, ఎగ్జిట్ అంచనాలపై బెంగాల్ సీఎం మమత ఫైరయ్యారు. ఈ సర్వేలను తాను అస్సలు నమ్మబోవడం లేదన్నారు. ఎగ్జిట్ పోల్స్ వార్తలను బాగా వ్యాప్తిలోకి తెచ్చి ఆ తర్వాత ప్రజల్లో భ్రమలు కల్పించి అదే సమయంలో ట్యాంపరింగ్ కోసం ఈవీఎంలను తరలించేందుకు కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తంచేశారు. కాగా విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపై నిలవాలని, తద్వారా మతతత్వ శక్తులను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని మమతా హెచ్చరించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా మమతా తన అభిప్రాయాన్ని పంచున్నారు.
ఇక మరో వైసు కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. మోడీ అండ్ గ్యాంగ్కి ఎలక్షన్ కమిషన్ పూర్తి లొంగిపోయిందంటూ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ఈవీఎంల నుంచి ఎన్నికల షెడ్యూల్ వరకు అన్నిటినీ మేనేజ్ చేశారని విమర్శించారు. నమో టీవీ, మోడీ ఆర్మీ ఇప్పుడు కేదార్ నాథ్ వేదికగా డ్రామాలు చేశారని అన్నారు.