కర్నూలు జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. కర్నూలు అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో ఆగ్రహంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కాసేపట్లో వైసీపీ అధినేత జగన్తో భేటీ అవుతారు. ఇవాళ ఉదయం కార్యకర్తలు, అభిమానులతో సమావేశం అయిన తర్వాత ఎస్వీ మోహన్రెడ్డి పార్టీ మారుతున్నట్లు ప్రకటంచారు. గతంలో వైసీపీని వీడి జగన్కు అన్యాయం చేశానని వ్యాఖ్యానించిన ఎస్వీ మోహన్రెడ్డి కర్నూలు వైసీపీ అభ్యర్థి హఫీజ్ విజయానికి కృషి చేస్తానని చెప్పారు.
కర్నూలు టీడీపీ అసెంబ్లీ స్థానం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డితో పాటు ఎంపీ టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్ కూడా పోటీ పడ్డారు. చివరికి టీజీ భరత్కే టికెట్ ఖరారవ్వడంతో ఎస్వీ మోహన్రెడ్డి తిరిగి సొంతగూటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదని ఎస్వీ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను , తనను మోసం చేసి బయటికి పంపారని ఆరోపించారు. తప్పును సరిదిద్దుకుని వైసీపీలో చేరుతున్నానని ఎస్వీ మోహన్రెడ్డి చెప్పుకొచ్చారు.