ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంపూర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ నాయకురాలు జయప్రద సమాజ్వాదీ పార్టీ నేత ఆజం ఖాన్పై విరుచుకుపడ్డారు. ఆజం ఖాన్ను తాను ఓ సోదరుడిగా గౌరవం ఇస్తే అతను మాత్రం తనని నాట్యగత్తె అని అవమానించాడని ఆవేదన వ్యక్తం చేశారు. నీ మాటలు నన్ను ఎంతో బాధపెట్టాయి. అందుకే నేను రాంపూర్ విడిచి వెళ్లాను అన్నారు. తనకు సంబంధించిన అశ్లీల చిత్రాలను సర్కులేట్ చేస్తూ తన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని జయప్రద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్నిములాయం సింగ్ దృష్టికి తీసుకువచ్చినా ప్రయోజనం లేకపోయిందని జయప్రద అన్నారు.
2004, 2009 ఎన్నికల్లో జయప్రద సమాజ్వాదీ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2010లో జయప్రదను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్కక్రమాలను పాల్పడుతున్నారనే అభియోగంతో ఆమెను పార్టీ నుంచి వెలివేశారు. అప్పటి నుంచి ఆమె అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన జయప్రద తిరిగి రాంపూర్ నుంచి పోటీకి దిగుతున్నారు. ఆజంఖాన్పై పోటీ చేస్తున్నారు. దీంతో ఆజంఖాన్ జయప్రదను టార్గెట్ చేస్తూ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమె ప్రతిష్టను దిగజార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.