ఏపీలో పోలింగ్ ముగిసిన దాదాపు నెలరోజుల తర్వాత పవన్ కల్యాణ్ బయటికి వచ్చారు. ఎన్నికల తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకున్న జనసేనాని ఇవాళ్టి నుంచి మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో బిజీ కానున్నారు. కౌంటింగ్కు కౌంట్డౌన్ దగ్గర పడుతుండటంతో ఎన్నికల్లో పార్టీ పెర్మామెన్స్పై సమీక్ష చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జనసేనాధిపతి పవన్ కల్యాణ్ మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కాబోతున్నారు. సరిగ్గా నెలరోజుల గ్యాప్ తర్వాత కర్నూలు జిల్లాలో పర్యటించిన పవన్ నంద్యాల జనసేన ఎంపీ అభ్యర్ధిగా పోటీచేసి, ఇటీవల మరణించిన ఎస్పీవై రెడ్డి కుటుంట సభ్యులను పరామర్శించారు.
అయితే ఎన్నికల తర్వాత దాదాపు నెలరోజులపాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న పవన్ ఇవాళ్టి నుంచి ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో పార్టీకి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని భావిస్తున్న పవన్ ఆయా అభ్యర్ధులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. పోలింగ్ తర్వాత జరిగిన ఇంటర్నల్ సర్వేల్లో కూడా జనసేనకు మెరుగైన ఓటింగ్ జరిగినట్లు రిపోర్టులు వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో కౌంటింగ్కి రోజులు దగ్గర పడుతుండటంతో ఓటింగ్ సరళి, ఆయా అభ్యర్ధుల గెలుపు అవకాశాలపై సమీక్షించనున్నారు. ఈరోజు నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేనాని సమీక్షలు నిర్వహించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలకు ప్లాన్ చేశారు. రివ్యూతోపాటు కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు.