ఏపీ ఎగ్జిట్ పోల్ ఫలితాలపై నేతలు ఏమనుకుంటున్నారు? సర్వేలు చెబుతున్నట్టు టీడీపీకి భంగపాటు తప్పదా? వైసీపీ అధికారంలోకి రాబోతుందా? అసలు టీడీపీ, వైసీపీ నేతలు ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ సర్వేలపై టీడీపీ, వైసీపీ డిఫరెంట్గా స్పందించాయి. ప్రజల నాడి పట్టుకోవడంలో సర్వేలు మరోసారి ఫెయిల్ అయ్యాయని చంద్రబాబు విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్పై ట్విట్టర్లో స్పందించిన చంద్రబాబు ఎగ్జిట్ పోల్స్ అన్నీ వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉన్నాయన్నారు. అయితే, ఏపీలో మళ్లీ టీడీపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
టీడీపీ అధినేత రియాక్షన్ ఇలాగుంటే, వైసీపీ లీడర్స్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ నిజం కాబోతున్నాయని బల్లగుద్దీమరీ చెబుతున్నారు. జనం జగన్ వైపే ఉన్నారని రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనంటున్నారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు భంగపాటు తప్పదని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. ఇక చంద్రబాబు ఓటమికి సాకులు వెతుక్కునే పనిలోనే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సెటైర్లు వేశారు.
మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉంటే, ఒకట్రెండు మాత్రమే టీడీపీకి పాజిటివ్గా ఇచ్చాయి. దాంతో ఇరుపార్టీల నేతలు డిఫరెంట్గా స్పందిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ నిజం కాబోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ లీడర్స్ అంటుంటే, సర్వేలపై తమకు నమ్మకం లేదంటున్నారు టీడీపీ నేతలు. మరి ఎవరి నమ్మకం నిజమవుతుందో తెలియాలంటే మరో రెండ్రోజులు ఆగాల్సిందే.